హైదరాబాద్ నగరశివారులోని శంషాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాంసిమియాగూడ వద్ద బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంది. అయితే.. గత అర్ధరాత్రి ఆలయం తాళాలు పగుల గొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు అందినకాడికి దోచుకున్నారు. అమ్మవారి ముక్కుపుడకతో పాటు హుండీలో ఉన్న డబ్బులు దోచుకుని ఉడాయించారు. అయితే.. ఈ ఆలయంలో చోరీ జరగడం ఇది రెండవ సారి కావడం విశేషం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ఆలయం ఆవరణలో ఉన్న సిసి కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.