బెయిల్పై విడుదలైన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ను.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో చింతమనేని నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయనకు భరోసా కల్పించారు. చింతమనేనికి, అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. అక్రమ కేసులకు తెలుగు తమ్ముళ్లు భయపడవద్దని ధైర్యం చెప్పారు. చంద్రబాబుతో పాటు మాజీ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చింతమనేని నివాసానికి తరలివచ్చారు.
అంతకు ముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి చింతమనేని పరామర్శించేందుకు పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలకు చేరుకున్నారు. చంద్రబాబు పర్యటన స్థానిక టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపింది.
మరోవైపు చింతమనేనిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకునేందుకే వంశీ పార్టీ మారారని ఆరోపించారు. రాజధాని, పోలవరం నిర్మాణాలను నిలిపివేసి రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్తున్నారని విమర్శించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. జగన్కు డబ్బా కొట్టేందుకే సరిపోతారని ఎద్దేవా చేశారు చినరాజప్ప.