ఏపీలో ఇంగ్లిష్ మీడియం బోధనపై మరో ఘాటు ట్వీట్ చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలుగు తల్లిని కాపాడాల్సిన మీరే.. తెలుగు భాషా తల్లిని చంపేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషా సరస్వతిని అవమానించకండి అంటూ విన్నపం చేశారు.
ఇంగ్లిష్ భాష వద్దని ఎవరూ అనడం లేదని పవన్ కల్యాణ్ ట్వీట్లో గుర్తుచేశారు. మాతృభాష అయిన తెలుగును... మృత భాషగా మార్చవద్దని వేడుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం జగన్ మోహన్ రెడ్డి... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మాతృభాషను, మాండలికాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సూటిగా చెప్పారాయన.
తెలుగు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ.. తెలుగు పత్రిక నడుపుతూ.. తెలుగును చంపేసే ఆలోచన భస్మాసుర తత్వాన్ని గుర్తుచేస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. మాతృభాషలో బోధన గొప్పతనాన్ని, అవసరాన్ని గుర్తుచేస్తూ.. పలు ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాలను ట్విట్టర్లో పోస్టు చేశారు.