ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చాడని మనస్థాపం చెంది..

Update: 2019-11-23 01:59 GMT

బాలాపూర్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎస్సై నరసింహను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరామర్శించారు. ప్రస్తుతం నరసింహ అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సీఐ సైదులు తనపై తప్పుడు రిపోర్టు ఇచ్చాడని నరసింహ ఆరోపించిన వ్యాఖ్యలను తాము పరిశీలిస్తున్నట్లుగా సీపీ చెప్పారు. దీంతో పాటు నరసింహ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు బాలాపూర్‌ సీఐ సైదులు, కానిస్టేబుల్‌ దశరథ్‌లను బదిలీ చేసి సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. తదుపరి విచారణలో వీరిద్దరి ప్రమేయం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

నగరంలోని బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒక కేసు విషయంలో తనకు సంబంధం లేకున్నా ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చాడని నరసింహ పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో 30 శాతం కాలిన గాయాలతో ఉన్న నరసింహను అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల బాలాపూర్‌ సీఐ తనను వేధిస్తున్నాడంటూ అదే స్టేషన్‌లో ఏఎస్సై గా పనిచేస్తున్న నరసింహ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని ఫిర్యాదును పట్టించుకోకుండా నరసింహను బాలాపూర్‌ నుంచి మంచాలకు ట్రాన్స్పర్‌ చేశారు. తన తప్పు లేకున్నా సీఐ ఇచ్చిన తప్పుడు రిపోర్టుతో తనను అక్రమంగా బదిలీ చేశారని మనస్థాపం చెందాడు. దీంతో శుక్రవారం నరసింహ పెట్రోల్‌ బాటిల్‌తో బాలాపూర్‌ పీఎస్‌కు చేరుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Similar News