గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభిస్తూ..సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివి. రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని..అందుకే తన మతం,కులంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తోందన్న జగన్...తన మతం మానవత్వం...కులం మాట నిలబెట్టుకునే కులమని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతోనే ఈ ఆర్నెల్లు పనిచేశానన్నారు. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తున్నామని చెప్పారు జగన్.
సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన...పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. మతం మార్చుకున్న జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు. కులం , మతం , ఓట్లు, డబ్బులు కావాలి అంటే కుదరదన్నారు. వైసీపీది రంగుల రాజ్యం అని ఆరోపించారు.
పవన్ విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. అసలు పవన్ను ఏమని పిలవాలో అర్థంకావడం లేదన్నారు. జగన్ క్రిస్టియన్ అని తెలిసే ప్రజలంతా ఓట్లు వేశారని...కలిసి మెలిసి ఉంటున్న వారి మధ్య చిచ్చు పెట్టటానికే పవన్ కుట్ర చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఇసుక కొరతను నిరసిస్తూ ఇటీవల విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. అప్పటి నుంచి జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. జగన్పై పవన్ విమర్శలు చేయడం దానికి వైసీపీ మంత్రులు కౌంటర్ ఇవ్వడం పరిపాటి అయిపోంది. ఇప్పుడు మతం, కులం వివాదం రెండు పార్టీల మధ్య మరోసారి అగ్గిరాజేసింది.