తమిళనాట కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. ఇప్పటి వరకు రాజకీయ అరంగేట్రంపై సందిగ్ధంలో ఉన్న సూపర్ స్టార్ ఫైనల్గా పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈనెల 12న పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది రజినీకాంత్ పొలిటికల్ పార్టీని ప్రారంభిస్తారని తెలుస్తోంది.
దేవుడు ఆదేశించినట్లే ఉంది. ఎట్టకేలకు కబాలీ క్లారిటీ ఇచ్చేశాడు. పొలిటికల్ పార్టీ ఏర్పాటుపై సూపర్స్టార్ రజనీకాంత్ స్పష్టమైన సంకేతాలిచ్చేశాడు. అన్నీ కుదిరితే డిసెంబర్ 12నే ప్రకటన రావొచ్చు. వచ్చే ఏడాదే రాజకీయ పార్టీ ప్రారంభం కావొచ్చు. స్వయంగా రజనీకాంత్ సలహాదారు తమిళరువీ మానియా చెప్పిన మాటలివి. రాజకీయ అరంగేట్రంపై తలైవాకు క్లారిటీ వచ్చేసిందని తమిళరువీ చెప్పారు. డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు. అందుకే ఆ రోజున రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తారని సమాచారం.
రావడం ఖాయం అంటూ రజనీకాంత్ తెగ ఊరించారు. ఇవాళ, రేపు అంటూ వాయిదా మంత్రం పఠించారు. అభిమానులు కూడా ఈ మాటలు వినీవినీ విసిగిపోయారు. దాంతో, రజనీకాంత్ ఓ ప్రకటన చేశారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ కొంత ఖుషీ ఫీలయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత రజనీ మళ్లీ సైలెంటైపోయారు. దాంతో అభిమానుల్లో మళ్లీ గందరగోళం ఏర్పడింది. అస్సలు రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారు..? పార్టీ ప్రకటన ఏ రోజు చేస్తారు...? అసలు పార్టీ ఉంటుందా..? ఉండదా..? అంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళరువీ మానియా, రజనీకాంత్తో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరు చర్చించారు. రజనీ రాజకీయ అరంగేట్రంపైనే డిస్కషన్ సాగినట్లు తెలుస్తోంది.
మొత్తానికి, తలైవా పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే వారం స్వయంగా రజనీకాంతే ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది రాజకీయ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉంటే, రజనీకాంత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మక్కల్ నీధి మయ్యమ్ అధినేత, నటుడు కమల్ హసన్ ప్రకటించారు. రజనీకాంత్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఐతే, కమల్తో పొత్తు పెట్టుకుంటారా? లేదా అన్నది మాత్రం ఆయన అధికారికంగా ప్రకటించలేదు.