అమరావతి గ్రామాల్లో ఆందోళన ఉద్ధృతమైంది. మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను వ్యతిరేకిస్తూ.. రైతులు ఆందోళన చెస్తున్నారు. రాజధాని కోసం తమ విలువైన భూములు పణంగా పెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు మోసం చేశారంటుూ మండిపడుతున్నారు. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. అమరావతి ప్రాంతాల్లో బంద్కు పిలుపునిచ్చారు. తూళ్లూరు, మందడం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎక్కడికక్కడ రాకపోకలను అడ్డుకున్నారు. వెలగపూడి, కొరగల్లు, నీరుకొండ, రాయపూడి ఆందోళనకు దిగారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వెంకటపాలెం వద్ద బస్సులు నిలివేయండతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. 3 కిలోమీటర్లు నడిచి సెక్రటెరియట్కు చేరుకున్నారు. పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.
అమరావతిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో.. భారీగా పోలీసులు మోహరించారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందంటున్నారు పోలీసులు. రైతుల ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.