దిశ నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సామాజిక కార్యకర్త కే. సజయ. అయితే.. ఈ పిటిషన్పై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీం ఆదేశాలతో శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషనర్. ఎన్కౌంటర్కు గురైన నిందితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసులు నమోదు చేయాలని పిటిషన్లో కోరారు. ఎన్కౌంటర్లో మరణించిన నిందితుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ చేపడతామని తెలుపుతూ.. మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.