తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు తిరుమల వచ్చిన వారికి సులభంగానే దర్శనం లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఐదు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. నిన్న 86,241 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 31,730 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో వచ్చే నెల లో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. మే 3న భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం, 4న సర్వ ఏకాదశి, 10న అక్షయతృతీయ, 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, రామానుజ జయంతి, శంకర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి, 23న అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.