అమరావతి రాజధాని ప్రాంత వైసీపీ నేతలపై వరసగా ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదంటూ నిన్న ఆ ప్రాంత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇవాళ తుళ్లూరు పోలీసు స్టేషన్లో తమ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కనిపించకపోతే ఎవరికి తమ గోడు వెల్లబెట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
జి.ఎన్ రావు కమిటికి వచ్చిన దగ్గర నుంచి.. మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. వారం రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు ఇంకాస్త తీవ్రమయ్యాయి. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరిస్తూ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు తమ ఎమ్మెల్యే మాత్రం కనిపించడం లేదని.. తమ సమస్య చెప్పుకుందాం అన్నా ఆమె అందుబాటులో లేరంటూ తుళ్లూరు ప్రాంత మహిళలు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఎస్సై అంజయ్యకి మహిళలు ఫిర్యాదు చేశారు.