విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అమరావతి జేఏసీకి సంబంధం లేని మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. పని నిమిత్తం వెళ్తున్న మహిళలను సైతం పోలీసులు అరెస్టులు చేస్తుండడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం నిర్బంధం అటూ మహిళలు వాపోతున్నారు. మేం బయట కూడా వెళ్లొద్దా అంటూ పోలీసులు చర్యలను మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇదేం అని పోలీసుల తీరును ప్రశ్నించిన టీవీ5 రిపోర్టర్పై కూడా పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. మహిళల్ని అరెస్ట్ చేస్తున్న ఘటనను చిత్రీకరిస్తుండగా టీవీ5 రిపోర్టర్ను పోలీసులు నెట్టివేశారు.
మహిళల్ని విచక్షణా రహితంగా వ్యాన్లలో ఎక్కించారు. బలవంతంగా ఈడ్చుకెళ్తూ.. రెక్కలు విరిచేస్తూ అరాచకంగా ప్రవర్తించారు. ఈ స్థాయిలో ఆంక్షలు, దాడులు తాము జీవితంలో చూడలేదని.. తామేం తప్పు చేశారని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. అమరావతిలోనే కాదు విజయవాడలో మహిళల ర్యాలీని కూడా పోలీసులు ఇలాగే అడ్డుకున్నారు. వందల మంది మహిళల్ని కర్కశంగా ఈడ్చుకుంటూ వెళ్లారు.