టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలతో ఏపీ అసెంబ్లీ వేడెక్కింది. ఓవైపు రైతు భరోసాపై చర్చ కొనసాగుతుండగానే.. అమరావతికి మద్దతుగా ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. వీధి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని జగన్ విమర్శించారు. పోడియం రింగ్ దాటి వస్తే బయటకు పంపండి అంటూ స్పీకర్కు సూచించారు జగన్. స్పీకర్ తమ్మినేని కూడా టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.