కౌన్సిల్ రద్దు చేస్తే.. జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారు: చంద్రబాబు

Update: 2020-01-24 13:31 GMT

కౌన్సిల్ రద్దుపై సీఎం జగన్ హెచ్చరికలకు తాము బెదిరేది లేదన్నారు చంద్రబాబు నాయుడు. కౌన్సిల్ సభాపతిని అసెంబ్లీలో తప్పుపట్టడం ఎక్కడైనా జరిగిందా..? అని ప్రశ్నించారు. ఒక సభాపతి ప్రసంగాన్ని ఇంకో సభలో ఎలా డిస్‌ప్లే చేస్తారని నిలదీశారు.

కౌన్సిల్ సభాపతి ప్రసంగానికి అసెంబ్లీలో వక్ర భాష్యాలు చెప్పిన సీఎం తీరు అత్యంత దారుణమన్నారు. జగన్ లాంటి అబద్ధాలకోరును తాను ఎక్కడా చూడలేదన్నారు. బిల్లును సెలెక్ట్ కమిటీ పంపడం ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటామనడం కౌన్సిల్ నేరం ఎలా అవుతుందన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా 1984 నాటి ఆగస్ట్ సంక్షోభాన్ని గుర్తు చేసుకున్నారు. నాటి ఘటన తనతోపాటు TDP ఎమ్మెల్యేలను హీరోలుగా చేసిందని.. అప్పట్లో ప్రజలు MLAలను ఊరేగించారని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు పాలాభిషేకాలు చూస్తుంటే నాటి ఘటనే గుర్తొస్తోందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసిన MLCల తీరును మెచ్చుకున్నారు.

జగన్ కౌన్సిల్‌ను రద్దు చేస్తే చరిత్రహీనుడిగా మిగులుతారని అన్నారు చంద్రబాబు. మెజారిటి ఉందని తలకు రోకలి చుట్టుకుంటాననడం మూర్ఖత్వమేనని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలో కేపిటల్ పదమే లేదనడం ఒక అబద్దమని, జయలలిత పాలన ఊటీ నుంచే అనడం మరో అబద్దమని చెప్పారు. జయలలిత విశ్రాంతికి ఊటికి వెళ్తే దానిని వక్రీకరించారన్నారు. వైసీపీ వీరంగాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇంతకింత మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 13 జిల్లాల ప్రజల దృష్టిలో YCP ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.

Similar News