కాసేపట్లో మండలి భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేయనుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పేద రాష్ట్రానికి మండలి అవసరమా అంటూ.. స్పష్టమైన ప్రకట చేశారు. మండలిని రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మండలిపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లెజిస్లేటివ్ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. అర్హులైన పేదలందరికీ ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు.