విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జీవో సైతం విడుదల చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ రూరల్, అనకాపల్లి, భీమిలి, ఆనందపురం, పెదగండ్యాట, పద్మనాభం, పరవాడ, గాజువాక, పెందుర్తి, సబ్బవరం మండలాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం భూములు గుర్తించినట్టు జీవోలో తెలిపారు. మొత్తం 6వేల 116 ఎకరాలకు పైగా భూములు సమీకరించాలని డెడ్లైన్ పెట్టుకున్నారు.
నవరత్నాల అమల్లో భాగంగా 'పేదలందరికీ ఇళ్లు' స్కీం కోసం భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం జీవోలో స్పష్టంచేసింది. అది రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే పథకం కాగా.. విశాఖపట్నం జిల్లాలో మాత్రమే భూసమీకరణకు ఉత్తర్వులు ఇవ్వడం సంచలనంగా మారింది. యుద్ధ ప్రాతిపదికన ల్యాండ్ పూలింగ్ పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.