సేవ్ అమరావతి అనే నినాదంతో ఢిల్లీకి చేరిన రాజధాని రైతుల పర్యటన ఐదో రోజూ కొనసాగుతోంది. గత నాలుగు రోజులు కేంద్రపెద్దలను కలిసిన రైతులు.. బుధవారం వీలైనంతమంది కేంద్రమంత్రులను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను కలిసే అవకాశం కూడా ఉంది.
ఢిల్లీకి చేరిన దగ్గర నుంచి బిజీగానే ఉన్నారు రాజధాని రైతులు. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్రమంత్రులను కలిసి తమ గోడు మొరపెట్టుకున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన తమపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోవలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్య, సామాజిక న్యాయ శాఖా మంత్రి గెహ్లాట్ను కలిసిన రాజధాని రైతులు. బుధవారం రాష్ట్రపతి, ప్రధానితో పాటు సోనియా, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తీసుకున్న తరువాతే ఢిల్లీ నుంచి అమరావతి వెళ్తామంటున్నారు.