ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆ సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరుతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తెస్తారని అధికార వర్గాల సమాచారం. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపుల జరపని విషయాన్ని ప్రధాని దృష్టికి తేనున్నారు.
అలాగే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మరోసారి ప్రధానితో చర్చించనున్నట్టుగా సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.