అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే తన రాజకీయ, ధనబలంతో సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ పేర్కొంది. సీఎంగా పాలన విషయంలో ఆయనకు బాధ్యత ఉందనడంలో సందేహం లేదని.. అయితే ఆ కారణంతో కోర్టుకు శాశ్వతంగా హాజరు కాలేనని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది.
సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సీబీఐ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో అనేక అంశాలను పొందుపరిచారు. జగన్పై తీవ్రమైన ఆరోపణలున్నాయని స్పష్టంగా తెలిసినప్పటికీ.. బెయిల్ షరతులను తిరస్కరిస్తున్నారని సీబీఐ ఆక్షేపించింది. చిన్నపాటి కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వొచ్చని.. తీవ్రమైన కేసుల్లో కాదంటూ గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది సీబీఐ.
జగన్ సీఎం అయినంత మాత్రాన కేసు పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కాదని.. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నారని సీబీఐ పేర్కొంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు చాలా అరుదుగా ఇవ్వాలని.. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. అవసరమైనప్పుడు సీఆర్పీసీ 317 ప్రకారం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరే అవకాశం ఉందని తెలిపింది. జగన్ కేసు చాలా సున్నితమైన హైప్రొఫైల్ కేసుగా అభివర్ణించింది సీబీఐ. హాజరు మినహాయింపు నిందితుల హక్కు కాదని.. కోర్టు విచక్షణేనని స్పష్టం చేసింది. ప్రజా విధుల్లో ఉన్నంత మాత్రాన హాజరు మినహాయింపు కోరడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని.. జగన్ అభ్యర్థన విచారణార్హం కాదని న్యాయస్థానానికి తెలిపింది. ఆయన అభ్యర్థనను కొట్టివేయాలని కోరింది సీబీఐ..
సీబీఐ, ఈడీ కలిపి వేసిన 16 చార్జ్షీట్లలో జగన్ నిందితుడిగా ఉన్నారని తెలిపింది సీబీఐ. నేర విచారణ నిందితుల సమక్షంలో జరగాలని సీఆర్పీసీ చెబుతోందని.. చట్ట రూపకర్తలు కూడా చట్టానికి లోబడే ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. సీబీఐ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ వేయడంతో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది.