ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారు : మంత్రి బొత్స

Update: 2020-02-16 19:42 GMT

ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్ వైసీపీతో కలిసేది లేదంటున్నారని, వారితో కలుస్తామని తాము చెప్పామా అంటూ నిలదీశారు. ఎన్నికల ముందు కూడా ఎన్డీఏతో కలిసి వెళ్తున్నారంటూ వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. వైసీపీ కలిస్తే తాను బయటికి పోతానని పవన్‌ అంటున్నారని, ఆయన్ను ఎవరు కలవమన్నారు?, ఎవరు వెళ్లమన్నారంటూ సెటైర్లు వేశారు బొత్స .

ఐటీ దాడుల విషయంలో చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు బొత్స. విచారణ జరిపించాలని వాళ్లిద్దరూ ఎందుకు కోరడం లేదని అన్నారు. శ్రీనివాస్‌ ఇంటిపై దాడులకు సంబంధించి ఐటీ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని...వాటిని కూడా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారని ఆరోపించారు. యనమల పరువు నష్టం దావా వేస్తామంటున్నారని.... తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరంటూ ఎద్దేవా చేశారు బొత్స.

Similar News