64వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

Update: 2020-02-19 09:56 GMT

అమరావతి ఉద్యమం ఇవాల్టితో 64 వ రోజుకు చేరింది. అయినా వెనక్కి తగ్గడం లేదు రాజధాని రైతులు . ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. విడతల వారీగా దీక్షలో కూర్చొని ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, యెర్రబాలెంలో ధర్నాలు, దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి.

అమరావతి ఉద్యమంతో రాజధాని గ్రామాలన్నీ నిరసనలతో అట్టుడుకుతున్నాయి. అమరావతే రాజధాని అని ప్రకటించే వరకు ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు రాజధాని రైతులు. అటు ఉద్యమానికి విద్యార్థి లోకం సైతం మద్దతు పలికింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థి ప్రతినిధుల బృందం రైతుల దీక్షకు విద్యార్థులు సంఘీభావం తెలిపింది. వివిధ జిల్లాల ప్రజలు సైతం సంఘీభావం తెలుపుతున్నారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ప్రకాశం వాసులు దీక్షా శిబిరాలకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు.

Similar News