ప్రగతిభవన్లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ముగిసింది. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పర్యటనకు వెళ్లారు. అక్కడున్న శాఖాహార, మాంసాహార మార్కెట్లను పరిశీలించనున్నారు. అంతకుముందు.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చే విధంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులు, ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేశారు. సదస్సులో ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతికి సన్నాహకంగా జరుగుతున్న ఈ సదస్సులో కార్యక్రమ నిర్వహణపై చర్చించారు.
పురపాలక సదస్సు దాదాపు 4 గంటలపాటు జరిగింది. పట్టణ ప్రగతికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, ఆలోచనలపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 24 నుంచి 10 రోజులపాటు జరగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంవిదివిధానాలు ఖరారు చేశారు. పచ్చదనం, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.