నమస్తే ట్రంప్ అంటూ అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికిన మోదీ..ట్రంప్ రెండు రోజుల పర్యటనలో ఇక్కడి సంస్కృతి గొప్పదనాన్ని పరిచేసుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఎయిర్ పోర్టును భారీ జనసందోహంతో ఆత్మీయ స్వాగతం పలికి..సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి గాంధీ జ్ఞాపకాలను గుర్తు చేశారు. చరఖాపై ట్రంప్ దంపతులతో నూలు వడికించారు. ఆ తర్వాత నమస్తే ట్రంప్ అంటూ నిర్వహించిన మెగా షో ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా చేశాయి.
తులీప్ పూల మొక్కల నడుమ సూర్యాస్తమం వేళ మెరిసిపోతున్నతాజ్ అందాలను వీక్షించిన ట్రంప్ దంపతులు ఫిదా అయిపోయారు. తాజ్ అందాలను ఆస్వాదించేందుకు మళ్లీ వస్తామన్నారు. భారత వివిష్ట అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడికి రెండో రోజున రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభిచింది. భార్య మెలానియాతో కలిసి వచ్చిన ట్రంప్కు.. రాష్ట్రపతి కోవింద్ ఆత్మీయ స్వాగతం చెప్పారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు రాజ్నాధ్సింగ్, జైశంకర్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు, కాన్సులేట్ సభ్యులను ట్రంప్కు మోదీ పరిచయం చేశారు.
రాష్ట్రపతి భవన్ విజిట్ తర్వాత ట్రంప్ దంపతులు రాజ్ఘాట్కు వెళ్లారు. అక్కడ మహాత్ముడి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. రాజ్ఘాట్లో ఒక మొక్కను నాటారు. రాజ్ఘాట్ సందర్శకుల పుస్తకంలో ట్రంప్, మెలానియాలు తమ తమ సందేశాలను పొందుపరిచారు. సార్వభౌమ దేశం భారత్తో అమెరికా ప్రజలు మరింత బలోపేతమైన బంధాలు కొనసాగిస్తారని ట్రంప్ పేర్కొ న్నారు. మహాత్మాగాంధీ మహోన్నత దార్శనికతను అమెరికా కూడా అనుసరిస్తుందన్న ట్రంప్, రాజ్ఘాట్ సందర్శన తమకు దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ట్రంప్ దంపతులకు గాంధీ విగ్రహం జ్ఞాపికను బహూకరించారు.
ఆ తర్వాత ట్రంప్- మోదీ ఇరు దేశాల ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై చర్చించారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మర్యాద పూర్వకంగా విందు ఇచ్చారు. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కరచాలనం చేసి రాష్ట్రపతి భవన్లోని రామ్పూర్వ బుల్ విగ్రహ ప్రత్యేకతతో పాటు చారిత్రక నేపథ్యాన్ని కోవింద్ స్వయంగా వివరించారు. బుద్ధుడి విగ్రహం వద్ద ఫొటో దిగారు. భారత ఆతిథ్యంతో ముగ్థుడైన ట్రంప్ ఇండియాలో గడిపిన రెండు రోజుల్ని జీవితంలో మరువలేనని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. తనకు భారత్ పట్ల, ఇక్కడి ప్రజల పట్ల అపారమైన గౌరవం ఉందని చెప్పారు.
భారత్పై ట్రంప్కు ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఇరు దేశాల బంధం సరికొత్త చరిత్రకు నాంది పలకాలని అభిప్రాయపడ్డారు. అంతకుముందు విందుకు హాజరైన కేంద్రమంత్రులు, 9 రాష్ట్రాల సీఎంలను ట్రంప్ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ట్రంప్ కరచాలనం చేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ దంపతులు.. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు.