గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో తవేరా కారు వట్టి చెరుకూరు మండలం ఐదవ మైలు వద్ద రోడ్డు పక్కన సైన్ బోర్డును ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒకటి రెండు కాదు పదికిపైగా పల్టీలు కొట్టుకుంటూ కారు వాగులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో వన్నూరు, రమణ, సీతమ్మ, వరలక్ష్మి, డ్రైవర్ శీను, మరొకరు ఉన్నారు. ఇదే ఘటనలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వట్టిచెరుకూరు ప్రమాద బాధితుల్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.