ఖమ్మం జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. ఇప్పటికే రాంపూర్-గోళ్లబుద్దరం మధ్య అడవిలోకి పోలీసుల బృందం చేరుకుంది. క్లూస్ టీంతో పాటు పోస్టుమార్టం టీం మృతదేహం దగ్గరకు చేరుకున్నాయి. ఆనంద్ రెడ్డి మృతదేహానికి అక్కడే పంచనామా చేయనుంది పోస్టుమార్టం టీం. క్లూస్ టీంతో పాటు ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే పంచనామా చేయనున్నారు.. తరువాత అక్కడ నుంచి అతడి స్వస్థలానికి మృత దేహాన్ని తరలించనున్నారు..
అయితే కిడ్నాప్ అయ్యారు అనుకున్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 44 ఏళ్ల ఆనంద్రెడ్డి దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. తీసుకున్న అప్పును ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఆనంద్రెడ్డి చేస్తున్న ఇసుక వ్యాపారంలో భాగస్వామి, స్నేహితుడు అయిన ప్రదీప్ రెడ్డి ప్రణాళిక ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రదీప్కు అతడి డ్రైవర్ నిగ్గుల రమేశ్, మరో ఇద్దరు సహకరించారు. భూపాలపల్లి రూరల్ మండలంలోని ఓ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఆనంద్రెడ్డి మృతదేహం లభ్యమైంది.