ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్, జనసేన నేత సుందరపు విజయ్కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 16న రెండు పార్టీలు నిర్వహించే రోడ్షోలో పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్సీ మాధవ్. జగన్ సర్కార్ అరాచకాలను కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లామన్నారు. డబ్బు, మద్యం అధికార పార్టీకి అస్త్రాలుగా మారాయని ఆరోపించారు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల నిర్వహణ సబబేనా అని మాజీ ఎమ్మెల్యే విష్ణురాజు ప్రశ్నించారు. ఎన్నికలను వాయిదా వేసి.. కరోనా తగ్గాక మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచి వాస్తవాలు గుర్తించాలన్నారు విష్ణురాజు.
జగన్ తన ఇష్టమొచ్చినట్టు.. ఎన్నికలు నిర్వహిస్తున్నారని జనసేన నేత సుందరపు విజయ్కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. నామినేషన్ల దశలోనే ప్రత్యర్థులను, భయపెట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. చివరకు ఓటర్లను ఓటు కూడా వేయానిస్తారో లేదని ఎద్దేవా చేశారు.