ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. నిన్న ఒక్కరోజే 793 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ తాజా లెక్కలతో చూస్తే ఇటలీలో ఇంత వరకూ 4 వేల 824 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 6 వేల 500 కేసులు నమోదవడంతో జనం భయపడి పోతున్నారు. దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా మిలన్ సమీపంలోని ఉత్తర లోంబర్డీలోనే దాదాపు 3 వేల మంది చనిపోవడం, వేల మంది రోగులు ఉండడంతో అక్కడ అత్యవసర వైద్య సేవలు అందించడం కూడా చాలా కష్టమవుతోంది.
దాదాపు 4 వారాలుగా ఇటలీ పూర్తిగా నిర్భందంలోనే ఉంది. ఐతే.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మొదట్లో సరైన జాగ్రత్తలు తీసుకోని ఫలితం ఇప్పుడు అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఆదేశాలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు.