తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న జనం
తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు అత్యవసరం మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. కిరాణా షాపులు, ఇతర రైతు బజార్లు మాత్రమే తెరుచుకున్నాయి. దీంతో నిత్యవసరాల సరుకుల కోసం ఉదయాన్నే జనం రోడ్లపైకి వచ్చారు. షాపుల దగ్గర క్యూ కట్టారు. ఆదివారం జనతా కర్ఫ్యూలో స్ఫూర్తిని చాటిన జనం.. సోమవారం దాన్ని కొనసాగించనట్లు కనిపిస్తోంది. ఇంటికి ఒక్కరే నిత్యవసరాల సరకుల కోసం బయటకు రావాలని ప్రభుత్వం సూచిస్తే.. దాన్ని బేఖాతరు చేస్తున్నారు. ప్రజా రవాణా బంద్ అయినా.. రోడ్లపై ప్రైవేట్ వాహనాల రద్దీ మాత్రం తగ్గలేదు.
మరోవైపు లాక్డౌన్ను తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు.. కూరగాయల ధరలను అమాంతం పెంచేశాయి. హైదరాబాద్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యవసర సరుకులపై ఎలాంటి ఆంక్షలు విధించనప్పుడు రేట్లు ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులతో జనం ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.