ఉచితంగా ఇవ్వాల్సిన పంచదార, గోధుమపిండికి డబ్బులు వసూలు చేయడమేంటని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో మానవత్వంతో పనిచేయాలని దేవినేని ఉమ సూచించారు. ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, కొండపల్లిలో పర్యటించిన దేవినేని ఉమా మాట్లాడుతూ.. సర్వర్లు పనిచేయక రేషన్ షాపుల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. నెట్వర్క్ పనిచేయడం లేదని.. వలంటీర్లు, వీఆర్వోలు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసి 90 శాతం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చుకున్నారని విమర్శించారు. వాళ్లతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయించాలని అన్నారు. సీఎం సమీక్షలు ఆపి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసరాల కోసం మహిళలు బయటకొస్తున్నారని.. హైలెవల్ కమిటీ, మంత్రులు ఏం చేస్తున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.