ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే వార్తను చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆదివారం కోవిడ్ -19 పై మాట్లాడిన ఆయన ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. గతవారం కంటే కేసులు, రికవరీ విషయంలో తేడాలు ఉన్నాయని అన్నారు. గతవారం కంటే కేసులు దాదాపు 200 తక్కువగా నమోదు అయ్యాయని ఆయన వెల్లడించారు. ఏడవ వారంలో 850 కేసులు, 21 మరణాలు , 260 రికవరీలు ఉన్నాయని.. అయితే ఎనిమిదవ వారంలో మాత్రం 622 కేసులు, 9 మరణాలు , 580 రికవరీలు ఉన్నాయని చెప్పారు.
ఈ లెక్కలతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఇచ్చిన సడలింపులను అమలు చేస్తామని చెప్పిన కేజ్రీవాల్.. ప్రజలకు అవసరమైన షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. మాల్స్ , షాపింగ్ కాంప్లెక్స్ లలో ఉండే మార్కెట్లకు అనుమతి లేదని.. కేవలం నివాస ప్రాంతాలలో ఉన్న దుకాణాలను మాత్రమే తెరవబడతాయని చెప్పారు. ఇక హాట్స్పాట్స్లో ఉండే షాపులకు మాత్రం అనుమతి ఇవ్వలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.