విద్యార్థులు సవంత్సరమంతా చదివారు. సరిగ్గా పరీక్షల సమయానికి కరోనా వచ్చి వారి కలలు కల్లలు చేసింది. పరీక్షల సంగతి అటకెక్కింది. రోజూ కరోనా వార్తలు.. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యలు. లాక్డౌన్ ఎన్ని రోజులు వుంటుందో చెప్పలేని పరిస్థితి. కేంద్రం చెప్పిన ప్రకారం మే3కి ముగియాలి. అది కాస్తా కొన్ని రాష్ట్రాల్లో మే7కి చేరింది. మరి ఏపీలో లాక్ డౌన్ ముగిసిన రెండు వారాలకి పదవతరగతి విద్యార్ధుల పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంఖ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సురేష్ పాల్గొన్నారు. లాక్డౌన్ పూర్తయ్యాక పదవతరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూనే పది తరగతి పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు.