తబ్లిగీ ఘటనతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఆ ఘటన మరువక ముందే పంజాబ్ కు సిక్కు యాత్రికుల టెన్షన్ ఎక్కువైంది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పంజాబ్కు తిరిగొచ్చిన వారిలో 542 మంది సిక్కు యాత్రికులకు టెస్టులు నిర్వహించారు. వారిలో 173 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే కరోనాతో పంజాబ్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. తాజా కేసులు సవాలుగా మారాయి.
మార్చి నెలలో మహారాష్ట్ర నాందేడ్లోని గురుద్వారా హజూర్ సాహిబ్కు పంజాబ్ నుంచి 3,500 మంది సిక్కు యాత్రికులు వెళ్లారు. లాక్డౌన్ అమలుతో సిక్కు యాత్రికులందరూ నాందేడ్లోనే ఉండిపోయారు. అయితే కేంద్ర హోంశాఖ అనుమతితో సిక్కు యాత్రికులను ప్రత్యేక బస్సులో పంజాబ్కు తరలించారు. ఆ తర్వాత క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా 173 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.