తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి రోడ్డును దాటుకుని గ్రామాన్ని ముంచెత్తుతున్నాయి. ఈదురు గాలులు తీరప్రాంతవాసుల్ని భయపెడుతున్నాయి. సరుగుడు తోటలు కూడా సముద్రపు కోతకు గురయ్యాయి. అటు, అంతర్వేది దగ్గర కూడా ఇలానే ఉంది. సముద్రం 50 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. లైట్హౌస్ వరకు అలలు పోటెత్తుతున్నాయి.
ఇప్పటికే కాకినాడ సహా అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంగా జూన్ 14 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. దీంతో ముందు జాగ్రత్తగా ఒడ్డున ఉన్న బోట్లు, వలలు, ఇతర సామాగ్రిని భద్రపరుచుకుంటున్నారు మత్స్యకారులు.
తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలల కల్లోలం వల్ల సముద్రం 20 మీటర్ల మేర ముందుకు వచ్చింది. విశాఖ తీరంలోనూ ఆంఫన్ ప్రభావంతో వాతావరణం మారిపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.