తెలుగుదేశం పార్టీ 'మహానాడు' రెండో రోజు గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదామని చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు వారి పండుగ అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శమన్నారు. ఆయన కృషి, క్రమశిక్షణ పట్టుదల, చిత్తశుద్ధి, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమన్నారు. ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవా నిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నేర్పింది ఎన్టీఆరే అని అన్నారు. ఆ యుగపురుషుడికి భారతరత్న ఇవ్వాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్కు 'భారతరత్న' వచ్చేలా మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు.