ఉత్తర భారతానికే పరిమితమైన ఆపిల్ సాగు.. తొలిసారి తెలంగాణలో సాకారమైంది. కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ తొలిసారి ఆపిల్ పండ్లు పండించారు. ఈ సందర్భంగా తన చేనులో పండిన తొలి పండ్లను సీఎం కేసీఆర్కు రుచిచూపించారు బాలాజీ. తొలికాతను సీఎం కేసీఆర్కు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రికి ఆపిల్ పండ్ల బుట్టతో పాటు మొక్కను బహుకరించి.. శుభాకాంక్షలు తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం ధనోరా గ్రామంలో.. రెండెకరాల్లో HR-99 యాపిల్ రకాన్ని సాగుచేసినట్టు తెలిపారు బాలాజీ. పంటసాగు విషయంలో ఉద్యానవన శాఖ ఎనలేని సహకారాన్ని అందించిందని అన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలిపారు బాలాజీ. ఈ సందర్భంగా రైతు బాలాజీని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలినవని చెప్పడానికి.. ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండించడమే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.