జగన్నాటకం అనే జగన్ నటన ముందు ఆస్కార్ కూడా దిగదుడుపే అని ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టెర్రరిస్టు ఇంటిపై దాడి చేసినట్లు బీసీ నేత అచ్చెన్నాయుడి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ అయిందని రిపోర్టులు చూపించినా మానవత్వం లేకుండా ప్రవర్తించారని పోలీసులపై లోకేష్ ఫైర్ అయ్యారు. కనీసం మందులు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా హింసించారని ఆయన విమర్శించారు. ఆరోపణ వచ్చిన రోజే విచారణకు సిద్ధమన్న అచ్చెన్నని 20 గంటలపాటు రోడ్లపై తిప్పి గాయం పెద్దదయ్యేలా అత్యంత క్రూరంగా జగన్ వ్యవహరించారని లోకేష్ మండిపడ్డారు. ప్రతి నిమిషం అచ్చెన్న పడుతున్న కష్టాన్ని తెలుసుకుని ఆనంద పడిన జగన్ ఇప్పుడు మంచి వైద్యం అందించాలని అధికారులకు చెప్పడం జగన్నాటకం కాకపోతే ఏమవుతుందని లోకేష్ అన్నారు.