ఆదివారం రాహుగ్రస్త సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాన్ని మూతపడ్డాయి. ఉదయం 10 గంటల 26 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటా 49 నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది. దీంతో చాలావరకు ఆలయాల్లో దర్శనాలను శనివారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. పూజల తర్వాత ఆలయాల తలుపులను మూసివేశారు. వేల మంది దర్శించుకునే తిరుమల శ్రీవారి ఆలయంలో మధ్యాహ్నం వరకు దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు గుడి మూసి ఉంటుందిని ఆలయ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం శ్రీవారికి ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామికి వారికి ఏకాంతంగానే పూజ కైంకర్యాలు నిర్వహిస్తారు.
బెజవాడ దుర్గమ్మ గుడిని నిన్న రాత్రి 7గంటల నుంచి మూసివేశారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి రేపు ఉదయం నుంచి మళ్లీ అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ సూర్యగ్రహం పాక్షికంగానే ఉంటుందన్నారు.
సూర్యగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ ప్రధానార్చకుల సమక్షంలో ఆలయ అధికారులు బాలాలయ తలుపులు మూసి తాళాలు వేశారు. గ్రహణం విడిచిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని నిన్న రాత్రి మూసివేశారు. సూర్యగ్రహణం విడిచాక ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి సాయంత్రం నాలుగున్నర నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు. భద్రాద్రి రాములవారి ఆలయంలో నిన్నటి నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అధికారుల సమక్షంలో గుడి తలుపులు మూసివేశారు. ఇవాళ సంప్రోక్షణ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి ఆరున్నర గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తారు. అయితే..ఇవాళ శ్రీకాళహస్తి గుడిని మాత్రం తెరిచే ఉంచుతున్నారు. గ్రహణం సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించటంతో పాటు..రాహుకేతు పూజలు నిర్వహించనున్నారు.