భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి బలం చేకూరుస్తూ... రెండు దేశాల బార్డర్స్లో పెద్ద ఎత్తున బలగాలు చేరాయి. రెండు వైపులా... వెయ్యి మందికిపైగా బలగాలు మోహరించినట్టు సమాచారం. గల్వాన్లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14, పాంగాంగ్ TSO వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు. దీంతో లద్దాఖ్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి.
కీలక ప్రాంతాల్లో భారత్- చైనాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయి. జూన్ 15 తర్వాత అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని... అయితే రెండు దేశాల నుంచి ఇటు గల్వాన్, అటు పాంగాంగ్లలో బలగాలు మోహరిస్తున్నాయని... ఆర్మీ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో... చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా అడ్డుకునేందుకు భారత్ తనుకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పాంగాంగ్ TSO నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్ ఆపరేషన్ చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఫింగర్ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్ అదుపులోనే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆ ప్రాంతంలో చైనా భారీగా ఆర్మీని రంగంలో దించుతుండగా... అదేస్థాయిలో భారత్ తన శిబిరంలోనూ సైనికులను రంగంలో దించుతోంది. అటు వాస్తవాధీన రేఖ వెంట ఇండియన్ ఆర్మీ మరింతగా అలర్ట్ అవుతోంది. LCA వెంట చైనా ఎలాంటి దురాక్రమణలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. 3 వేల 488 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు వెంట.. ప్రత్యేక దళాలను రంగంలో దించారు.