తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక హైదరాబాద్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో పని చేస్తున్న ఓ హోంగార్డు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
56 ఏళ్ల మహ్మద్ అసదుద్దీన్.. సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ ఆఫీసులో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూన్ 28న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి అతను హోం క్వారంటైన్ లో ఉన్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో.. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హోంగార్డు మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచాడు. అసదుద్దీన్ మృతి పట్ల పలువురు పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.