AMARAVATHI: ప్రజా రాజధాని అమరావతికి కొత్త ఊపిరి

అమరావతి పునరుజ్జీవానికి సర్వం సిద్ధం... పునర్నిర్మాణ పనులకు నేడు ప్రధాని అంకురార్పణ;

Update: 2025-05-02 02:30 GMT

ఏపీ రాజధాని అమరావతికి మంచి రోజులొచ్చాయి. ఐదేళ్లుగా నిలిచిన రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రూ.49 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి సకలం సిద్ధం చేసింది. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆకాంక్షలు, భావోద్వేగాలను గౌరవిస్తూ కలల రాజధాని నిర్మాణ పనులు నేడు పునఃప్రారంభం కానున్నాయి. మే 2 రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపుగా, చిరస్థాయిగా నిలిచిపోనుంది.

లక్ష రూపాయల పనులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. రాజధానిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. దీనితో పాటు రాష్ట్రంలోని డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేకు సంబంధించి రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అంటే దాదాపు లక్ష రూపాయల పనులను ప్రారంభిస్తారు.

అయిదు లక్షల మందితో సభ

అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభం వేళ భారీ బహిరంగ సభ కోసం 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 20 మంది ఆసీనులు కానున్నారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఉండనుంది.దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉండనుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్‌ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని మోదీకి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

6000 బస్సులు

జిల్లాలకు మొత్తం 6,600 బస్సుల్ని కేటాయించారు. మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1,400 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క బస్సులో 120 ఆహారపొట్లాలు, 100 అరటిపండ్లు, 120 నీటిసీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్‌లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలు సిద్ధం చేశారు. 11 చోట్ల వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారు మొబైల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటర్ బాటిళ్లతో పాటు కార్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కు చెందిన పరికరాలను కూడా తీసుకు రావద్దని సీఆర్డీఏ అధికారులు కోరారు.

Tags:    

Similar News