AP: దావోస్‌లో చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

మూడు రోజుల్లో 30 ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ;

Update: 2025-01-19 02:30 GMT

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్‌కు వెళ్లిన చంద్రబాబు మూడు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు కనీసం 30 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యేలా ప్రణాళిక రచించారు. ముందే ఖరారైన భేటీలతోపాటు... అప్పటికప్పుడు అవకాశాన్నిబట్టి ఇతరులతోనూ సమావేశమవుతారు.

తొలి రోజు...

దావోస్‌ పర్యటనలో తొలిరోజున చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారితో సమావేశమవుతారు. ఆ తర్వాత హిల్టన్‌ హోటల్‌లో పది మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్‌లోని ప్రవాసాంధ్రులతో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’తో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి పలువురు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో డిన్నర్‌లో పాల్గొంటారు.

రెండో రోజు...

దావోస్‌లో రెండో రోజున సీఐఐ సెషన్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ అంశంపై జరిగే చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత సోలార్‌ ఇంపల్స్‌ కోకొకోలా, వెల్‌స్పన్‌, ఎల్‌జీ , క్లార్స్‌ బర్గ్‌, సిస్కో, వాల్‌ మార్ట్‌ ఇంటర్నేషనల్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌తో చర్చలు జరుపుతారు. అనంతరం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ నిర్వహించే ‘ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ వేర్‌ పబ్లిక్‌ పాలసీ మీట్స్‌ ప్రైవేట్‌ గోల్స్‌’ అనే అంశంపై చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడతారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల విధానాలను వివరిస్తారు.

మూడో రోజు...

దావోస్‌లో మూడోరోజున పలు దిగ్గజ సంస్థల అధినేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. నాలుగోరోజు ఉదయం దావోస్‌ నుంచి జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటారు. సీఎం బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు పరిశ్రమల శాఖ, ఈడీబీ అధికారులు ఉంటారు.

Tags:    

Similar News