CBN:ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు

ప్రధానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు... పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్న హోంమంత్రి;

Update: 2025-01-08 02:30 GMT

విశాఖకు వస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ట్వీట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఏపీకి వస్తున్న ప్రధాని మోదీకి ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నామని అన్నారు. రూ.2లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్ధికి కీలక ముందడుగన్నారు. తమకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

ఏపీకి ప్రధాని ఇస్తున్న బహుమతి

కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా విశాఖకు ప్రధాని మోదీ వస్తున్నారని... ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. భద్రతపరంగా ఎటువంటి ఇబ్బందులూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కొన్ని లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఇస్తున్న బహుమతని... అందుకు ప్రతిఒక్కరూ మోదీకి అభినందలు తెలపాలని హోంమంత్రి అన్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాన్నారు. నేడు నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని హోంమంత్రి కోరారు.

ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్

ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు... ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్ కాబోతోందని మంత్రి అ‌చ్చెన్న అభిప్రాయపడ్డారు. మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాలు ఏపీని ఆర్థికంగా గట్టెక్కిస్తున్నాయి అన్నారు. మొన్నటి వరకు ఐసీయూలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సొంతగా ఆక్సిజన్ పీల్చుకునే స్థితికి వచ్చిందన్నారు.

స్టీల్ ప్లాంట్‌‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు త్వరలో కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి రూ.17 వేల కోట్లు రివైవల్ ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందని అన్నారు.

Tags:    

Similar News