CBN: ఏపీలో ప్రమాదకర రాజకీయాలు: చంద్రబాబు

రాజకీయాలు మారాలన్న ముఖ్యమంత్రి... రాజకీయాలు ఎటుపోతున్నాయో తెలియట్లేదని ఆవేదన;

Update: 2025-06-05 04:30 GMT

 ఏపీలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు.. ఇప్పుడు నేరస్థుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్థులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

వేధించడం సరికాదన్న చంద్రబాబు

గత వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు... చంద్రబాబుతో అన్నారు. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని గత ప్రభుత్వంలో జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి గుర్తు చేశారు. మనల్ని అన్యాయంగా వేధించారని మనమూ వేధించటం సరికాదన్న చంద్రబాబు.. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పారదర్శకంగా విచారణ జరుపుతామన్నారు. నేరం రుజువైతే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదని.. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. పోలవరం -బనకచర్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతోందని సీఎం తెలిపారు. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News