YOGA: యోగాంధ్ర సూపర్ హిట్
ఒకేసారి రెండు గిన్నీస్ రికార్డు సృష్టించడం అరుదైన విషయమన్న చంద్రబాబు;
విశాఖలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగాంధ్ర సూపర్ హిట్ అని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు. 3 లక్షల 3వేల మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని.. ఒకేసారి రెండు గిన్నీస్ రికార్డులు సృష్టించటం ఇదే ప్రథమమని అన్నారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామన్నారు. ప్రకృతి కూడా కరుణించిందని చంద్రబాబు చెప్పారు. 20 రోజుల క్రితం వర్షం పడుతుందని చూపించటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. వరుణదేవుడు కూడా కరుణించాడన్నారు. అన్ని దేశాలు గుర్తించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగాంధ్రకు విశేష ప్రాచుర్యం కల్పించారని చంద్రబాబు తెలిపారు. ఇంత పెద్ద వేడుకను చిన్న ఇబ్బంది కూడా లేకుండా సాంకేతిక సాయంతో విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.
100 పర్యాటక ప్రదేశాల్లో...
26 జిల్లాల్లో 26 థీమ్ బేస్ యోగా నిర్వహించామన్నారు. 100 పర్యాటక ప్రదేశాల్లో అనుకుంటే 101 చోట్ల చేశారని చంద్రబాబు తెలిపారు. లక్షకు పైగా ప్రదేశాల్లో రెండున్నర కోట్లమంది యోగా చేసినట్లు వెల్లడించారు. విశాఖలో 10 ఏళ్ల క్రితం హుద్ హుద్ పరిణామాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. నాడు దీపావళి టపాసులు కాల్చొద్దంటే మానేశారని.. నేడు యోగాకు రమ్మంటే ఉత్సాహంగా తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగస్వాములైన వారికీ సీఎం అభినందనలు తెలియజేశారు.
ప్రధానికి సీఎం కృతజ్ఞతలు
యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. గేమ్ ఛేంజర్గా నిలిచిన ఈ వేడుకకు ఓ లాజికల్ ముగింపు ఇస్తామని తెలిపారు. యోగా వల్ల కుటుంబానికి భారం కాదని.. రాష్ట్రానికి భారం కాదని గుర్తించాలన్నారు. ఇంకా పెద్ద ఎత్తున యోగాంధ్రను ప్రోత్సహిస్తామని చెప్పారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి నూతన ఒరవడిలు సృష్టిస్తున్నామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుతూ వైద్య ఖర్చులు బాగా తగ్గేలా ఈ ప్రాజెక్టు రూపొందుతోందన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం పనితీరు వల్ల ప్రజా చైతన్యం పెరిగిందని ప్రధాని గుర్తించారన్నారు. వాస్తవాలు లేకుంటే ప్రధాని మాట్లాడరని.. ప్రధాని ప్రశంసలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.