ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎంపీగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను అత్యున్నత ణ్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై దాడి చేశారంటూ రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, కార్యాలయ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును ఇకపై కొనసాగించదలచుకోలేదని కానిస్టేబుల్ బాషా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం, రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రఘురామకృష్ణరాజుకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది.