ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆశా వర్కర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వనుంది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. వర్కర్లందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. వీరిలో గ్రామాల్లో 37,017 మంది ఉంటే... పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి నెల జీతం కింద రూ. 10 వేలు అందుతోంది. ఇక సర్వీసు ముగింపులో గ్రాట్యుటీ కింద రూ. 1.5 లక్షలు అందే అవకాశం ఉంది.