Andhra Pradesh: మరో విషయంలో జగన్ ప్రభుత్వం వెనకడుగు.. శాసనమండలి రద్దుపై నిర్ణయం..

Andhra Pradesh: జగన్‌ సర్కారు మరో విషయంలోనూ వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-11-23 06:00 GMT

Andhra Pradesh (tv5news.in)

Andhra Pradesh: జగన్‌ సర్కారు మరో విషయంలోనూ వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గతంలో శాసనమండలిని రద్దుచేయాలని చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు శాసనసభలో ఇవాళ కొత్త తీర్మానం ప్రవేశపెట్టనుంది. శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతారని తెలుస్తోంది. గతేడాది జనవరిలో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులను మండలి వ్యతిరేకించింది.

అయితే మండలి నిర్ణయంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో టీడీపీ బలం ఎక్కువుందని.. ప్రజాబలంతో గెలిచిన 151 మంది ఎమ్మెల్యే నిర్ణయాన్ని తప్పుబడతారా అంటు మండిపడ్డారు. అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్‌ అని తేల్చిచెప్పారు. అసలు మండలి వ్యవస్థే అవరం లేదన్నారు. మండలి నిర్వహణకు లక్షల్లో భారం మోయాల్సి వస్తోందన్నారు జగన్. ఈక్రమంలోనే మండలిని రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గతేడాది జనవరి 27న శాసనసభలో తీర్మానం పెట్టారు.

మండలి రద్దు నిర్ణయం తీసుకున్నప్పుడే కొందరు మంత్రులు జగన్‌ ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏడాదైతే మనకే ఆధిక్యం వస్తుందని సర్దిచెప్పారు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీకి మండలిలో ఆధిక్యం వచ్చింది. ఇదే సమయంలో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మండలి రద్దు తీర్మానం ప్రస్తావనకు రానున్నట్లు అధికార వైసీపీకి సమచారం అందింది.

దీంతో వెంటనే శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుని. కేంద్రానికి పంపాలన్న నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. అయితే జగన్‌ చెప్పాడంటే చేస్తాడనే వైసీపీ నేతల నినాదం క్రమంగా మసకబారుతోంది. మొన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం, నిన్న మూడు రాజధానుల ఉపసంహరణ, ఇవాళ మండలి రద్దు.. ఇలా అన్ని విషయాల్లో తన నిర్ణయాలను జగన్ వెనక్కి తీసుకోవాల్సి రావడంపై జోరుగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News