ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
AP High Court: ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.. నియమ నిబంధనలు చెప్పకుండా ఒక్క ప్రెస్నోట్తో ఇంటర్ బోర్డు ఆన్లైన్ అడ్మిషన్ల మార్గదర్శకాలను జారీ చేయడంపై కాలేజీ యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.. కాలేజీల తరపున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకుండానే ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అడ్మిషన్లు ఆన్లైన్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఆన్లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు బోర్డు తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. తల్లిదండ్రులు, పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా నిబంధనల కారణంగా ఆన్లైన్ అడ్మిషన్లు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆర్డర్స్ను రిజర్వ్ చేసింది.