AP HIGH COURT: నిర్మాణమే జరగకుండా లబ్ధా?
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు;
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR) నిర్మాణమే జరుగలేదని, ఒక్క ఎకరా భూమి సేకరించని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని... కేవలం కాగితాలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో కొందరికి లబ్ధి చేకూరిందన్న మాటే ఉత్పన్నం కాదని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే చంద్రబాబుపై వరుస కేసులు పెడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం క్రిమినల్ చర్యలుగా చిత్రీకరిస్తోందని చంద్రబాబు నాయుడి తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసులు పెట్టి వేధించడానికి చట్ట నిబంధనలను ఆయుధంగా వినియోగిస్తోందన్నారు. ఐఆర్ఆర్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు దురుద్దేశపూరితంగా చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదు చేస్తోందని ఆయన తరపున న్యాయవాదులు వాదించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలే కాలేదన్న విషయం ప్రస్తావించారు. దాని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి మాస్టర్ ప్లాన్, రింగ్రోడ్డును పట్టించుకోలేదని వివరించారు. అందువల్ల రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్పు ద్వారా కొందరికి లబ్ధి, మరికొందరికి నష్టం జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పిటిషనర్కు బెయిలు మంజూరు చేయాలని కోరారు.
చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్థ లిస్టెడ్ కంపెనీ అని.. లక్షలాది మంది ప్రజలు షేర్హోల్డర్స్గా ఉన్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు 2014లోనే కంపెనీ భూములు కొనుగోలు చేసిందని,సంబంధిత భూమి ఐఆర్ఆర్కు నాలుగు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఎలైన్మెంట్ మార్పు ద్వారా లబ్ధి చేకూర్చినందుకే లింగమనేని తన నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చారన్న సీఐడీ ఆరోపణల్లో వాస్తవం లేదు. క్విడ్ ప్రోకో కింద వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారన్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. 2017 జులై నుంచి చంద్రబాబు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారని... అద్దె కింద 2019 జూన్లో 27 లక్షలు చెల్లించారని తెలిజయజేశారు. రాజధాని నిర్మాణం కోసం అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదని C.R.D.A చట్టం సెక్షన్ 146 స్పష్టం చేస్తోందన్నారు. రాజధాని బృహత్తర ప్రణాళిక, ఇన్నరింగ్ రోడ్డు ఎలైన్మెంట్ తుది నోటిఫికేషన్ను... ఫిర్యాదుదారు, వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పట్లో సవాలు చేయలేదన్నారు. అభ్యంతరాలు కూడా లేవనెత్తలేదని న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఆరేళ్ల తర్వాత కేసు నమోదు చేసినట్లు ధర్మాసనం తీర్పులో గుర్తుచేసిందన్నారు.