AP Liquor Policy: మందుబాబులకు 'షాక్' కొట్టే ధరలు.. ఏపీలో..
AP Liquor Policy: ఏపీలో అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే అభాసుపాలవుతున్న ప్రభుత్వం తాజాగా మద్యం విధానంలోనూ రివర్స్ తీసుకుంది;
AP Liquor Policy: ఏపీలో అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే అభాసుపాలవుతున్న జగన్ సర్కార్.. తాజాగా మద్యం విధానంలోనూ రివర్స్ తీసుకుంది.రెండున్నర ఏళ్లు లిక్కర్ రేట్లు వింటేనే ధడ పుట్టించేలా చేసిన సర్కార్...ఉన్నట్టుండి వాటిరేట్లను భారీగా తగ్గించింది. వైసీపీ సర్కారు వచ్చీ రాగానే.. మద్యం పాలసీని మార్చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది.
ఏక్కడలేని బ్రాండ్లను పరిచయం చేసింది. ధరలను 25 శాతం పెంచింది. లాక్డౌన్ తర్వాత కూడా ధడ పుట్టించేలా..అప్పటికప్పుడు ఏకంగా ధరలను 75 శాతం పెంచేసింది. ఆదాయం భారీగా పెంచుకునే వ్యూహంలో భాగంగానే.. YCP సర్కార్ ఇదంతా చేస్తుందనే విమర్శలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అటు 'మద్యం ధరలు చూస్తే షాక్ కొట్టేలా ఉండాలి.
భారీ రేట్లతో మందుబాబులు.. లిక్కర్ జోలికి వెళ్లకుండ ఉండాలి. మద్యం ముట్టకుంటేనే.. ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారని!.. గతంలో స్పష్టంచేసిన సీఎం జగన్.. ఒక్కసారిగా మాటమార్చి రేట్లను భారీగా తగ్గించటం అందర్ని ఆశ్చపరుస్తోంది. సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. పొరుగు రాష్ట్రాల నుంచి చీప్లిక్కర్తోపాటు ఇతర బ్రాండ్ల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.
దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందనే.. ఏపీలో రేట్లను ఉన్నట్టుండి తగ్గించి.. విక్రయాల జోరు పెంచేందుకు పక్కాప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ ఏడాది లిక్కర్ మీద.. 25వేల కోట్ల ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి ఆరు నెలల్లో 10వేల కోట్లు ఆదాయం సమకూర్చుకుంది. మిగిలిన ఆరు నెలల్లో మరో 15వేల కోట్ల ఆదాయం రాబట్టాలి అంటే.. అమ్మకాలు పెరిగేందుకు ధరలను తగ్గిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీలో వైసీపీ సర్కార్ లిక్కర్ ధరలను తాజాగా 15- 20 శాతం తగ్గించింది. బ్రాండ్ను బట్టి క్వార్టర్పై కనీసం 20 నుంచి 50 వరకూ, ఫుల్ బాటిల్పై 120 నుంచి 200 వరకూ తగ్గుదల వర్తింపజేసింది. అన్ని రకాల బీర్లపై 20 నుంచి 30 వరకూ ధర తగ్గనుంది. చీప్లిక్కర్ బ్రాండ్లపై అధికంగా, ప్రీమియం బ్రాండ్లపై తక్కువగా ధరలు తగ్గనున్నాయి.
చీప్లిక్కర్లోని కొన్ని రకాల బ్రాండ్ల ధర తెలంగాణలో కంటే ఏపీలోనే తక్కువగా, మరికొన్ని బ్రాండ్ల ధర తెలంగాణతో సమానంగా ఉండేలా సవరించారు. అటు ఒక్కో మద్యం కేసు మూలధరపై వ్యాట్, స్పెషల్ మార్జిన్ రేటు, అదనపు ఎక్సైజ్ సుంకం, అదనపు కౌంటర్వయిలింగ్ డ్యూటీలను సవరిస్తూ.. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. చీప్ లిక్కర్ రేట్లు గణనీయంగా తగ్గటంతో.. వినియోగం మరింత పెరిగి.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించవచ్చనే అంచనాలున్నాయి.