ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ, అమిత్ షాలు శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్ చేశారు. కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారు పేరని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజల అభివృద్ధికై ప్రార్థిస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. అలాగే దేశ అభివృద్ధికి ఆంధ్రులు చేసిన అపారమైన కృషి ప్రసంసనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ ప్రభుత్వం... ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం అంఖిత భావంతో కేంద్రం పనిచేస్తుందని అమిత్ షా అన్నారు.